హరిద్ర, నిశా, యవతి అనే పేర్లు కూడా కలిగిన పసుపు సర్వజనోపకరమైనది. పసుపు దుంపజాతికి చెందినది. అల్లం వలె భూమి అడుగున పెరుగుతుంది. స్త్రీలకు సౌభాగ్య సాధనంగాను, ఆరోగ్య పరంగాను ఎన్నో ఉపయోగాలుకలిగినది పసుపు.
పసుపు కొబ్బరితోటలలో అంతరపంటగా పెంచుతూ ఉంటారు. పసుపు చెట్టు సమూలముగా పసుపు వాసన వస్తుంది. అన్ని రకాల వంటలలోను పసుపు వినియోగించడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం.
పసుపు ప్రయోజనాలు
- పసుపు క్రిమినాశినిగా పనిచేస్తుంది. రక్తశుద్ధిని కలిగిస్తుంది.
- కాలిపగుళ్ళు ఉన్నవారు పసుపు కొమ్ము అరగదీసి పూతలా వేసినట్లయితే పగుళ్ళు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.
- ముఖసౌందర్యం పెంపొందడానికి, రక్తదోషాలు తగ్గడానికి పసుపు ఎంతో మంచిది.
- కురుపులు, పుండ్లు, రక్తహీనత తొలగించడంలో పసుపు ప్రధానమైనది.
- పసుపు విషహారిణి. అతిసారము, వాపులు తగ్గించడానికి వినియోగిస్తారు.
- బియ్యపు కడుగులో పసుపు, బెల్లంకలిపి సేవిస్తే మూలశంక వ్యాధి నశిస్తుంది.
- పచ్చి పసుపుదుంపను అరగదీసి పాలతో కలిపి సేవిస్తే కడుపులో నులిపురుగులు నశిస్తాయి.
- పసుపును నాటు ఆవు మూత్రంతో కలిపి సేవిస్తే కుష్ఠువ్యాధి వంటి భయంకర వ్యాధి కూడా తగ్గుతుందని ఆయుర్వేద గ్రంథాలు తెలియచేస్తున్నాయి.
- పసుపు, బెల్లం, గోమూత్రం కలిపి సేవిస్తే బోదకాలు కూడా తగ్గుతుంది.
- పసుపులో తేనె, పంచదార పొడి కలిపి తాగితే దగ్గు, శ్లేష్మంతో కూడిన వాంతులు, తగ్గుతాయి.
- పసుపు కషాయంతో ఉసిరిపళ్ళ రసం, తేనె కలిపి తాగితే మూత్ర దోషాలు తగ్గుతాయి.
- పసుపు కషాయంలో కరక్కాయ చూర్ణం కలిపి తాగితే ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది.
- పచ్చిపసుపు రసం, మిరియాలపొడి కలిపి తాగుతూ ఉంటే ఎలాంటి దగ్గు అయినా మటుమాయం అవుతుంది.
- పసుపు పొడిని ఆవునేతిలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
- పసుపు, వేపాకు కలిపి నూరి పైన పూతగా రాస్తే మశూచి, ఆటలమ్మ వల్ల వచ్చే పొక్కులు తగ్గుతాయి.
- సున్నము, పసుపు, పెరుగులో కలిపి నూరి పట్టువేస్తే గవదబిళ్ళలు తగ్గుతాయి.
- పచ్చి పసుపు దుంపను అరగదీసి గాయాలపై రాస్తే అవి త్వరగా మానిపోతాయి.
- పసుపు దుంప కషాయం పిల్లలకు పట్టిస్తే నులిపురుగులు తగ్గిపోతాయి. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటారు.
- పసుపును నిప్పులపై వేసి ఆ పొగను పీలిస్తే మూర్ఛ, ఫిట్సు వ్యాధి తగ్గుముఖం పడుతూ ఉంటుంది.