ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు
ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు (పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు.
ఆకుకూరలద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.